- ఆరు సంవత్సరాల విచారణకు ముగింపు – చారిత్రాత్మక తీర్పు
- ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్లు సహా ప్రధాన నిందితులకు శిక్ష
- ‘అత్యంత అరుదైన కేసు’గా అభివర్ణించిన కోర్టు
- సీబీఐ సాక్ష్యాలు, ఫోరెన్సిక్ రిపోర్టులతో వెలుగులోకి నిజాలు
- అబద్ధ ఆరోపణలే ప్రాణాలు తీసిన విషాద ఘటన
- తండ్రీ–కొడుకుల హత్య కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
2020 లాక్డౌన్ సమయంలో కస్టడీలో తండ్రీ–కొడుకులను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో తమిళనాడు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే అమానుషానికి ఒడిగట్టిన ఈ ఘటనలో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది.
న్యూస్ డెస్క్| పెన్ పవర్ ఏప్రిల్ 6:
తమిళనాడులో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తండ్రీ–కొడుకుల కస్టడీ మరణాల కేసులో మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2020 లాక్డౌన్ సమయంలో పోలీసుల కస్టడీలో అమానుష చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోయిన జయరాజ్, ఆయన కుమారుడు బెన్నిక్స్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్తో పాటు మరో ఆరుగురు పోలీసు కానిస్టేబుళ్లను కోర్టు దోషులుగా తేల్చింది. దీర్ఘకాలంగా కొనసాగిన విచారణ అనంతరం నిందితులందరికీ మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

‘అత్యంత అరుదైన కేసు’గా వ్యాఖ్యలు
తీర్పు సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఉన్న పోలీసులే ఇంతటి అమానుషానికి పాల్పడటం అత్యంత దారుణమని పేర్కొంది. ఈ కేసును ‘అత్యంత అరుదైనది’గా అభివర్ణిస్తూ కఠిన శిక్ష తప్పనిసరి అని స్పష్టం చేసింది.
సీబీఐ విచారణలో బయటపడిన దారుణాలు
దాదాపు ఆరు సంవత్సరాల పాటు సాగిన విచారణలో సీబీఐ కీలక సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ నివేదికలను కోర్టుకు సమర్పించింది. విచారణలో భాగంగా, తండ్రీ–కొడుకులిద్దరినీ లాకప్లో రాత్రంతా తీవ్ర శారీరక, లైంగిక హింసకు గురిచేసినట్లు నిర్ధారణ అయింది. పోలీసులు చేసిన దాడుల వల్ల తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.
అబద్ధ ఆరోపణలతో అరెస్టు:
2020 జూన్ నెలలో లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి మొబైల్ షాపును అనుమతించిన సమయానికి మించి నడిపారనే ఆరోపణలతో జయరాజ్, బెన్నిక్స్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తర్వాత ఆ ఆరోపణలు అసత్యమని బయటపడింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఘటన:
ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పోలీసుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజలు, మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేశాయి.

