ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వెనక్కి తగ్గాడని ఆరోపిస్తూ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని వాగ్య తండాలో ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా సమస్యకు పరిష్కారం లభించలేదని యువతి వాపోయింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోనని ఆమె స్పష్టం చేసింది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమై, గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
- ప్రియుడి ఇంటిముందు యువతి నిరసన
- పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి వెనక్కి తగ్గాడా?
- గ్రామ పెద్దల పంచాయతీ ఫలించలేదా.?
- న్యాయం కోసం యువతి మౌన పోరాటం
- స్థానికంగా ఉద్రిక్తత రేపిన ఘటన
మహబూబాబాద్, పెన్ పవర్, ఏప్రిల్ 7:
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండె శివారు వాగ్య తండాలో ప్రేమ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. వాగ్య తండాకు చెందిన తేజావత్ రఘురాం, కేసముద్రం మండలం రేకుల తండాకు చెందిన గూగులోత్ స్పందన గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ, ఇటీవల రఘురాం పెళ్లికి నిరాకరిస్తున్నట్లు యువతి ఆరోపించింది. ఈ విషయంపై గతంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించినట్లు స్పందన తెలిపింది. అయితే సమస్యకు ఎలాంటి పరిష్కారం రాకపోవడంతో, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రఘురాం ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ప్రేమించి ఇప్పుడు పెళ్లికి వెనక్కి తగ్గడం అన్యాయమని ఆమె వాపోయింది. తన డిమాండ్ నెరవేరే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని యువతి స్పష్టం చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు, గ్రామ పెద్దలు మరోసారి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది.

