ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణకు కార్మికుల వ్యతిరేకత
ఎన్ఎంయూ పిలుపుతో ఏలేశ్వరం డిపోలో నిరసన
ఎర్ర రిబ్బన్లతో విధులకు హాజరైన సిబ్బంది
ఖాళీల భర్తీపై డిపో అధ్యక్షుడు డిమాండ్
ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి నడపాలన్న కార్మికుల అభిప్రాయం
ఏలేశ్వరం, పెన్ పవర్, ఫిబ్రవరి 24:
ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే, ఉద్యమం తప్పదని ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు. ఎన్ ఎమ్ యు పిలుపుమేరకు ఏలేశ్వరం డిపో ఆవరణలో కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. ఎర్ర రిబ్బన్లు ధరించి విధులకు హాజరైన సిబ్బంది మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం డిపో అధ్యక్షుడు కె ఎస్ కె రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే విధానాన్ని మానుకోవాలని, ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, ఖాళీగా ఉన్న కండక్టర్ డ్రైవర్ మెకానిక్ ఆఫీస్ సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం డిపో కార్యదర్శి కె. త్రిమూర్తులు, గ్యారేజీ అధ్యక్షుడు శేఖర్ బాబు, భీమన సూరిబాబు, వై అప్పారావు, కే ఎస్ నారాయణ, చింతపల్లి సతీష్, ముత్తా విష్ణు, రాజేష్, రవి కార్మికులు పాల్గొన్నారు.



