15 రోజులుగా నిలిచిన బీఎస్ఎన్ఎల్ సేవలు
అత్యవసరాల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి
ఫిర్యాదులకు స్పందన లేదని గ్రామస్తుల ఆవేదన
గిరిజన గ్రామాలకూ కమ్యూనికేషన్ సమస్య
వెంటనే సిగ్నల్ పునరుద్ధరణకు డిమాండ్
పట్టించుకోని బీఎస్ఎన్ఎల్ అధికారులు
సిరిబాల గ్రామస్తుల ఆవేదన
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఫిబ్రవరి 24:
గూడెం కొత్త వీధి మండలంలోని అత్యంత మారుమూల గ్రామమైన సిరిబాలలో సెల్ టవర్ ఉన్నప్పటికీ సిగ్నల్ అందుబాటులో లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సెల్ టవర్కు గత 15 రోజులుగా సిగ్నల్ లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అత్యవసర పరిస్థితుల్లో బయట ప్రాంతాలకు సమాచారం అందించేందుకు గ్రామస్తులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సిగ్నల్ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు తెలియజేసినా ఎలాంటి స్పందన లభించలేదని గ్రామస్తులు వాపోతున్నారు.సిరిబాల గ్రామంతో పాటు పరిసర గిరిజన గ్రామాల ప్రజలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. కనీస కమ్యూనికేషన్ సదుపాయం లేక అత్యవసర సమయాల్లో ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించి, సెల్ టవర్కు వెంటనే సిగ్నల్ పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.



