ముంచంగిపుట్టు, పెన్ పవర్, మే 11.అల్లూరి జిల్లా, ముంచంగిపుట్టు మండలం, మాకవరం పంచాయతీ, మేభ గ్రామానికి చెందిన యువకుడు అల్లంగి రెడ్డి (27) ఆదివారం జరిగిన బైక్ ఏక్సిడెంట్ లో తీవ్ర గాయాలై కేజిహెచ్ లో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానిక ఎస్సై పి నాని తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మేభ గ్రామానికి చెందిన అల్లంగి సుబ్బారావు, అల్లంగి రెడ్డిలు ద్విచక్ర వాహనంపై లబ్బూరు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ తో ఢీకొన్నాయి. ఈ ఘటనలో అల్లంగి రెడ్డికు తీవ్ర గాయం కావటంతో విశాఖపట్నం కేజి హెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెడ్డి సోమవారం సాయంత్రం మరణించినట్లు ఎస్ఐ నాని తెలిపారు.మృతి చెందిన రెడ్డికు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెడ్డి మరణ వార్త విన్న భార్య ప్రమీల, తండ్రి గురుమూర్తి, తల్లి తుల, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. యువకుడు రెడ్డి మరణంతో మేభ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

