పేకర్ లేఔట్ పార్కు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జూలై 5 : నగరంలోని రామ్నగర్ సమీపంలోని పేకర్ లేఔట్ పార్కును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు, వ్యయ అంచనాలను సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఆదివారం జీవీఎంసీ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి, కార్యనిర్వాహక ఇంజనీర్ గంగాధర్తో కలిసి కమిషనర్ పేకర్ లేఔట్లోని పార్కు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కు అభివృద్ధికి అవసరమైన చర్యలు, మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు.
పేకర్ లేఔట్ రెసిడెంట్స్ అసోసియేషన్ (FLORA) ప్రతినిధులు కమిషనర్ను కలిసి, ఆ ప్రాంతంలో 650కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని, ప్రజలకు వాకింగ్, వ్యాయామం, చిన్నారుల ఆటల కోసం సమీపంలో సరైన పార్కు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. పార్కు అభివృద్ధికి జీవీఎంసీ ప్రతిపాదించే నిధుల్లో మూడో వంతు (1/3) మొత్తాన్ని అసోసియేషన్ భాగస్వామ్యంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
దీనిపై స్పందించిన కమిషనర్, అసోసియేషన్ తమ భాగస్వామ్యంపై వ్రాతపూర్వకంగా జీవీఎంసీకి లేఖ సమర్పించాలని సూచించారు. అనంతరం పార్కులో వాకింగ్ ట్రాక్, పచ్చదనం, చిన్నారుల ఆట పరికరాలు, ఓపెన్ జిమ్తో పాటు ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి వ్యయ అంచనాలతో నివేదిక సమర్పించాలని కార్యనిర్వాహక ఇంజనీర్ గంగాధర్ను ఆదేశించారు.
పర్యటనలో ఫ్లోరా అసోసియేషన్ కార్యదర్శి సుధాకర్ రాజు, ప్రతినిధి సతీష్, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.

