పోలీసుల వార్షిక క్రీడా సంబరాలు – 2025
-ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
బ్యూరో రిపోర్ట్ , పెన్ పవర్ :
అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కైలాసగిరి పోలీస్ పెరేడ్ మైదానంలో “వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025” శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, శాంతికి చిహ్నంగా పావురాలు మరియు బెలూన్లను గాలిలోకి ఎగరవేసి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం సబ్ డివిజన్లతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీసు అధికారులు మరియు సిబ్బంది గౌరవ వందనం స్వీకరిస్తూ నిర్వహించిన మార్చ్ పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పోలీస్ విధులు నిరంతరం ఒత్తిడితో కూడుకున్నవి. గత రెండు నెలలుగా బందోబస్తులు, ఇతర కార్యక్రమాల వల్ల ఈ క్రీడలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈ రోజు వీటిని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ స్పోర్ట్స్ మీట్ కేవలం ఆటలకే పరిమితం కాదు. ఇది మన శాఖలోని ఐపీఎస్ అధికారుల నుండి కానిస్టేబుల్ స్థాయి వరకు అందరినీ ఒకే వేదికపైకి తెస్తుంది. తోటి సిబ్బందితో పరిచయాలు పెంచుకోవడానికి, విభాగాల మధ్య సమన్వయం పెంపొందించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశమని అన్నారు. ప్రతి పోలీస్ అధికారి రోజుకు కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక శ్రమ లేదా క్రీడల్లో పాల్గొనాలి. ఇందుకోసం పెద్ద మౌలిక సదుపాయాలు అవసరం లేదని, వాలీబాల్, షటిల్ వంటి ఆటలు ఆడినా మానసిక, శారీరక దృఢత్వం లభిస్తుందని సూచించారు. రాబోయే ఏడాదిలో అనకాపల్లి జిల్లా కేంద్రంలో సొంతంగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్, జిల్లా పోలీస్ కార్యాలయం మరియు అంతర్గత క్రీడా సముదాయాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.నేటి క్రీడా ఫలితాలు
సిబ్బందిలో ఉత్సాహం నింపేందుకు ఎస్పీ స్వయంగా 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని అందరినీ ఉత్సాహ పరిచారు.

*800 మీటర్ల పరుగు:* 1. మొదటి స్థానం: టి.సి.హెచ్.కుమార్ (AR) 2. రెండవ స్థానం: ఏ.నారం నాయుడు (AR) 3. మూడవ స్థానం:వై.నాగరాజు (DPO)*
400 మీటర్ల పరుగు:
మొదటి స్థానం: ఎస్సై వై.తారకేశ్వరరావు (నాతవరం)రెండవ స్థానం: ఆర్.ఐ. బి.రామకృష్ణారావు
మూడవ స్థానం: ఆర్.ఐ. ఎల్.మన్మధరావు
విజేతలకు ఎస్పీ ప్రశంసా పత్రాలు మరియు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన్ రావు, డీఎస్పీలు ఇ.శ్రీనివాసులు, బి.మోహన రావు, పి.శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తి, సంజీవరావు మరియు ఇతర జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

