సిక్కోలు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి డైరెక్ట్ హమ్సఫర్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. ఈ నెల 13 నుంచి కొత్త సర్వీసు పట్టాలెక్కనుంది. భక్తులకు ఇకపై ప్రయాణంలో ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషికి ఫలితం దక్కింది.
- సిక్కోలు-తిరుపతి మధ్య తొలి డైరెక్ట్ రైలు
- ఏప్రిల్ 13 నుంచి హమ్సఫర్ సేవల ప్రారంభం
- భక్తులకు బెర్తుల సమస్యకు చెక్
- విశాఖ రద్దీ నుంచి విముక్తి
- మరిన్ని రైలు సర్వీసులు తీసుకురావడమే లక్ష్యం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, శ్రీకాకుళం, ఏప్రిల్ 09:
శ్రీకాకుళం జిల్లావాసుల చాలా ఏళ్ల కల చివరికి నిజమైంది. జిల్లా నుంచి నేరుగా తిరుపతికి వెళ్లే హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వేశాఖ ఆమోదించింది. 17439/40 నంబర్తో నడిచే ఈ రైలు ఈ నెల 13వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి బయలుదేరి, సోమవారం శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కు చేరుతుంది. అలాగే సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం నుంచి తిరుపతికి ప్రయాణిస్తుంది. ఈ కొత్త సర్వీసుతో తిరుమల వెళ్లే భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది.ఇప్పటి వరకు భువనేశ్వర్ లేదా విశాఖపట్నం మార్గంలో వచ్చే రైళ్లపైనే ఆధారపడాల్సి వచ్చేది. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల బెర్తులు దొరకక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

ఈ డైరెక్ట్ రైలు అందుబాటులోకి రావడంతో ఆ సమస్యలు చాలా వరకు తగ్గనున్నాయి.ఈ రైలును సాధించేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిరంతరంగా కృషి చేసినట్లు తెలిపారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త రైలు సర్వీసులు తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
