- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతోనే ప్రజలకు ఉచిత విద్యుత్.
- తమకోసం పనిచేసే ప్రభుత్వం..నాయకుల కష్టాన్ని ప్రజలు గుర్తించాలి.
- రాష్ట్రం కోసం చంద్రబాబు విధ్వంసకర రాజకీయ దుష్టశక్తులతో పోరాడుతున్నారు.
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 12:
చిలకలూరిపేట : తమ సంతోషం, సంక్షేమంతో పాటు, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు విధ్వంసకర రాజకీయ దుష్ట శక్తులతో పోరాడుతున్నారనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. తమకోసం.. రాష్ట్రం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకుల కష్టాన్ని ప్రజలు గుర్తించాలని, అప్పుడే అవకాశవాద నాయకుల రాజకీయ దుకాణాలు మూతపడతాయని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.
పీఎం సూర్యఘర్ పథకం అవగాహనా కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట మండలం దండమూడిలో పర్యటించిన ఆయన, గ్రామస్తులు తమ ఇళ్లపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్స్ ప్రారంభించి, అనంతరం గ్రామంలో 7లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి సుజల స్రవంతి నీ ప్రారంభించి, లబ్ధిదారులతో మాట్లాడారు. సూర్య ఘర్ పథకం ప్రయోజనాలను వారికి వివరించిన అనంతరం, గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో ప్రత్తిపాటి మాట్లాడారు.
ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడమే సూర్య ఘర్ ఉద్దేశం
దళిత, బలహీన వర్గాలతో పాటు, అర్హులైన ఇతర వర్గాల పేదలకు ఉచిత విద్యుత్ అందించాలి.. వారిని సౌర విద్యుత్ వినియోగంవైపు మళ్లించాలన్న సదుద్దేశంతోనే ప్రధాని మోదీ సూర్యఘర్ పథకానికి శ్రీకారం చుట్టారని ప్రత్తిపాటి వివరించారు. ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతినెలా తమపై పడే విద్యుత్ బిల్లుల భారం నుంచి ప్రజలు ఉపశమనం పొందవచ్చన్నారు. ప్రతినెలా ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి కోటి కుటుంబాల్లో సౌర కాంతులు నింపాలన్న గొప్ప లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి శ్రీకారం చుట్టాయని ప్రత్తిపాటి తెలియచేశారు. రాయితీతో కూడిన విద్యుత్ ప్రయోజనాలు అందించే పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వనియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, సొసైటీ చైర్మన్ కోడె హనుమంతరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, జాకోబు రాజు, గ్రామ నాయకులు కనపర్తి సుబ్బారావు, గుజ్జనగుడి కృష్ణ, ప్రవీణ్, కరెంట్ డిఇ ఏడుకొండలు, ఏడిఈ అశోక్, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

