- వ్యవసాయ, పాడి రంగాలకు సాంకేతిక బలోపేతం
- మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం
- రైతులకు ప్రత్యక్ష మార్కెట్ అనుసంధానం
- ఉత్పత్తులకు బ్రాండింగ్ – గిట్టుబాటు ధర లక్ష్యం
- శాఖల సమన్వయంతో ముందస్తు కార్యాచరణ
- జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఆకాంక్ష
స్టాఫ్ రిపోర్టర్ పెన్ పవర్, పార్వతీపురం. ఫిబ్రవరి 24 :
మార్ట్ (మన్యం అగ్రి రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ ) ప్రాజెక్టు అమలుతో జిల్లాలో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. మన్యం జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో మార్ట్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలను మంగళవారం సాయంత్రం నాటికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మార్ట్ అమలుపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని రైతులు, పాడి రైతులు, గ్రామీణ వృత్తిదారుల ఆదాయాన్ని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

పంటల ఉత్పాదకతను పెంచడం, వ్యవసాయ, పాడి రైతులకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించి లాభదాయకంగా చేయడం జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, వారు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, ఉత్పత్తులను బ్రాండింగ్ చేసి, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రత్యక్ష మార్కెట్ అనుసంధానం చేయడం కూడా ఇందులో భాగమేనని అన్నారు. వీటిని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలను ఆయా శాఖల అధికారులు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడిఏ ఏపీఓ మురళీధర్, డీఆర్డిఏ పీడీ ఎం.సుధా రాణి, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా.ఎస్.మన్మధరావు,జిల్లా వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



