కొత్తపేట, పెన్ పవర్, మే16:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శని జయంతి, శని అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు, హోమాలు, జపాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.ఈ సందర్భంగా ఆలయానికి వివిధ పూజా సేవల ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరింది. ముఖమండప సేవల ద్వారా రూ.1,30,200, ఏకాదశ రుద్ర తైలాభిషేకాల ద్వారా రూ.3,89,500, మహాన్యాస పూర్వక తైలాభిషేకాల ద్వారా రూ.1,89,350 ఆదాయం లభించింది. తైలం సమర్పించి దర్శనం ద్వారా రూ.95,120, తిలదానం ద్వారా రూ.150, స్వయం హోమాల ద్వారా రూ.2,400, కేశఖండన ద్వారా రూ.120, స్వయం జపం ద్వారా రూ.8,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.అదేవిధంగా ఫోన్ పే, ఇతర డిజిటల్ చెల్లింపుల ద్వారా రూ.1,09,400 వసూలైంది. మొత్తం ప్రత్యక్ష పూజా సేవల ద్వారా రూ.9,24,240 ఆదాయం లభించగా, పరోక్ష పూజల ద్వారా మరో రూ.7,27,000 సమకూరింది. అన్నప్రసాద విరాళాల రూపంలో రూ.72,379 అందినట్లు వెల్లడించారు. మొత్తం కలిపి ఆలయానికి రూ.17,23,619 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.

శని జయంతి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, క్యూలైన్లు, ప్రసాద పంపిణీ, భద్రతా ఏర్పాట్లు సమకూర్చినట్లు తెలిపారు.ఈ వివరాలను దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి సురేష్ బాబు వెల్లడించారు.

