రమేష్ అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి
పెందుర్తి పోలీసులకు తల్లి లక్ష్మి ఫిర్యాదు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం / పెందుర్తి, ఆగస్టు 9: రాతిచెరువు ప్రాంతానికి చెందిన పెదపాటి రమేష్ అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన తల్లి పెదపాటి లక్ష్మి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మృతిపై కుటుంబ సభ్యులకు పలు అనుమానాలు ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
రమేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడని, గతంలో అతని భార్య కుటుంబ సభ్యులతో విభేదాలు, ఘర్షణలు జరిగినట్లు ఆమె తెలిపారు. ఆగస్టు 8వ తేదీ అర్ధరాత్రి మృతికి కొద్దిసేపటి ముందు రమేష్ తన అన్న సాయితో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలించాలని పోలీసులను కోరారు.
రమేష్ మృతికి అసలు కారణాన్ని నిర్ధారించేందుకు మృతదేహానికి పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఫోన్ కాల్ వివరాలు, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలించి ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరారు.
రమేష్ది సహజ మరణమా, ప్రమాదమా, ఆత్మహత్యా లేక ఇతర కారణాల వల్ల జరిగిందా అనే విషయాన్ని ఆధారాలతో తేల్చాలని లక్ష్మి పోలీసులను కోరారు. దర్యాప్తులో హత్యకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

