సింహాచలంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న
-ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం , సింహాచలం, ఆగస్టు 1: లోక్సభ సభ్యుడు, లోక్సభ ప్యానెల్ స్పీకర్, మాజీ డీజీపీ (ఐపీఎస్) శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. నాదస్వర మంగళవాయిద్యాలు, వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ ఆలయంలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఆలయంలోని మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని సంప్రదాయాన్ని పాటించారు. అనంతరం స్వామివారి సహస్రనామార్చన సేవలో పాల్గొని మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఈవో జల్లేపల్లి వెంకటరావు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, ప్రసాదాలతో పాటు శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.

