కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రావణమాస పూజలు
ఐదు శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు.. సామూహిక లలితా సహస్రనామ పారాయణం, లక్ష కుంకుమార్చన
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 9:
కురుపాం మార్కెట్ ప్రాంతంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఈనెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ సంఘ అధ్యక్షులు ఆరిశెట్టి దినకర్, కార్యదర్శి పెనుగొండ వెంకట కామరాజు తెలిపారు.
ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నూతనంగా నిర్మించి ప్రతిష్ఠించిన బాలాలయంలో శ్రావణమాసంలో వచ్చే ఐదు శుక్రవారాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించనున్నారు. మహిళల ఆధ్వర్యంలో సామూహిక లలితా సహస్రనామ పారాయణం, లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆగస్టు 14న తొలి శుక్రవారం అమ్మవారికి రజిత వస్త్రాలంకరణ, 108 స్వర్ణపుష్పార్చన, సామూహిక లలితా సహస్రనామ పారాయణం, లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 21న రెండో శుక్రవారం పట్టువస్త్రాలంకరణతో పాటు సామూహిక పూజలు, ఆగస్టు 28న మూడో శుక్రవారం పుష్పవస్త్రాలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 4న నాల్గవ శుక్రవారం హరిద్రవస్త్రాలంకరణ, సామూహిక పారాయణం, లక్ష కుంకుమార్చన జరగనుండగా, సెప్టెంబర్ 11న ఐదో శుక్రవారం శ్రీమహాలక్ష్మి దేవికి పసుపునీళ్లతో ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 4న భారీ స్థాయిలో నారాయణ సేవ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
శ్రావణమాసంలోని ఐదు శుక్రవారాల్లో నిర్వహించే సామూహిక కుంకుమ పూజలకు అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానం తరఫున ఉచితంగా అందజేస్తామని, ఎలాంటి రుసుము వసూలు చేయబోమని నిర్వాహకులు స్పష్టం చేశారు. నగరంలోని ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
కాగా, ఆదివారం ఆలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ప్రముఖ వర్తకులు బద్రినారాయణ–ఉమామహేశ్వరి దంపతులు పూజా కార్యక్రమాల కరపత్రాన్ని ఆవిష్కరించారు.

