గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 11:
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని గార్ల ఎస్ఐ సాయికుమార్ సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులకు గార్ల పోలీస్స్టేషన్ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించి ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, అనుమతులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండపానికి తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతి పొందాలని సూచించారు. పోలీస్శాఖ అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. డీజేలకు నిషేధం ఉందని, లౌడ్స్పీకర్ల వినియోగంలో నిబంధనలు పాటించాలని, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్స్పీకర్లు వినియోగించరాదని తెలిపారు.మండపాల వద్ద విద్యుత్ భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, రహదారులపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీస్శాఖకు సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, యువకులు పాల్గొన్నారు.

