కలకలం రేపిన ఘటన
చింతూరు, పెన్ పవర్ మే 14:
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చింతూరు మండలంలోని లక్కవరం గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు మూట రమేష్ (37)గా గుర్తించారు. గ్రామ ప్రధాన రహదారి పక్కన ఉన్న అంగన్వాడీ కేంద్రం వెనుక భాగంలో రమేష్ మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం అందించడంతో మోతుగూడెం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలానికి చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ చేరుకుని పరిస్థితిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

