నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం మున్సిపాలిటీ వార్డు విభజన ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. వార్డుల విభజన ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మాకిరెడ్డి బుల్లి దొర దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు, మున్సిపల్ వార్డులు విభజన నిలిపివేస్తూ బుధవారం స్టే విధించింది. మున్సిపాలిటీలో 28 వార్డులను 40 కి పెంచుతూ విభజన ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాకిరెడ్డి బుల్లి దొర మాట్లాడుతూ వార్డు విభజన ప్రక్రియను సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించలేదనే కారణంతోనే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. బుధవారం స్టే ఉత్తర్వులు రావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. వార్డు విభజనలో ప్రజల అభ్యంతరాలు, చట్టబద్ధమైన విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించినట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేద్దామని ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు మరి కొంతకాలం నిరీక్షించాల్సిందే.

