హెల్మెట్ ధరిస్తేనే ప్రాణాలకు భద్రత
అక్కయ్యపాలెం జంక్షన్లో 4వ టౌన్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న అవగాహన కార్యక్రమం
విశాఖపట్నం: నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ ఆదేశాల మేరకు రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలను ట్రాఫిక్ పోలీసులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం అక్కయ్యపాలెం జంక్షన్లో 4వ టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ సుదర్శన్ రావు ఆధ్వర్యంలో PEN స్కూల్ విద్యార్థులతో కలిసి హెల్మెట్ వినియోగంపై వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి “హెల్మెట్ ధరించండి – ప్రాణాలు కాపాడుకోండి” అంటూ నినాదాలు చేస్తూ ద్విచక్ర వాహనదారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని ఎస్ఐ సుదర్శన్ రావు సూచించారు.
విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం స్థానికులను ఆకట్టుకోగా, రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు మరింత ఉపయోగపడతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

