రాజీ మార్గంలో కేసుల సత్వర పరిష్కారానికి అవకాశం
గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, ఆగస్టు 13: జాతీయ లోక్అదాలత్ ద్వారా కేసులను పరస్పర అంగీకారం, రాజీ మార్గంలో సత్వరమే పరిష్కరించుకోవచ్చని మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, రంపచోడవరం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఎం. మురళి గంగాధరరావు తెలిపారు.సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై గురువారం రంపచోడవరం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టు హాలులో పోలీసులు, న్యాయవాదులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్అదాలత్ నిర్వహణ, కేసుల గుర్తింపు, కక్షిదారులకు సమాచారం అందించడం, రాజీ ద్వారా కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.అడ్డతీగల, రంపచోడవరం న్యాయస్థానాల పరిధిలో పెండింగ్లో ఉన్న రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి, సంబంధిత కక్షిదారులకు లోక్అదాలత్ ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని తెలియజేయాలని న్యాయమూర్తి సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు శాఖ సిబ్బంది, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్న కక్షిదారులు సెప్టెంబర్ 12న జరిగే జాతీయ లోక్అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కేసుల పరిష్కారం కూడా సులభతరం అవుతుందని తెలిపారు.ఈ సమావేశంలో ప్రభుత్వ న్యాయవాది పూనం రవీంద్రమోహన్, సీనియర్ న్యాయవాదులు ఎం.వి.ఆర్. ప్రకాశ్, కె. సత్యప్రసాద్, ఆర్.ఆర్. భగవాన్, యాళ్ల శ్రీనివాస్, న్యాయవాదులు వీరబాబు, గౌరీశంకర్, లక్ష్మీనారాయణ, వివిధ పోలీస్స్టేషన్ల ఎస్సైలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

