ఈ నెల 31లోగా ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీ పూర్తి చేయాలి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ , పాడేరు, ఆగస్టు 13: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్–2026)లో భాగంగా జారీ చేయాల్సిన నోటీసుల పంపిణీ ప్రక్రియను ఈ నెల 31లోగా వంద శాతం పూర్తి చేయాలని అల్లూరి జిల్లా కలెక్టర్ టి. నిషాంతి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో నోటీసుల జారీ, పంపిణీ, విచారణను వేగవంతం చేయాలని సూచించారు.
నోటీసులను కేవలం పంపిణీ చేసినట్లు నమోదు చేయకుండా, సంబంధిత ఓటర్లకు నేరుగా అందజేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే ఫారం–6, 7, 8 దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణతో పాటు ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

