విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ మరింత బలోపేతం అవుతోంది.ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లను కొత్తగా ఈ జోన్లోకి చేర్చారు.తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా డివిజన్ నుంచి వీటిని విశాఖ డివిజన్కు బదిలీ చేస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.ఉత్తరాంధ్ర రైల్వే సేవలకు ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల డిమాండ్కు ఇప్పుడు పరిపాలనా రూపం దక్కిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్కు మరో బలం
ఇచ్ఛాపురం–పలాస సెక్షన్లో 7 స్టేషన్ల బదిలీ
ఖుర్దా డివిజన్ నుంచి విశాఖ డివిజన్కు మార్పు
ఉత్తరాంధ్ర రైల్వే సేవలకు అడ్మినిస్ట్రేటివ్ బూస్ట్
నెరవేరిన శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల కోరిక
విశాఖపట్నం | పెన్ పవర్ | ఏప్రిల్ 3:
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ (SCoR) పరిధి మరింత విస్తరించింది. తూర్పు కోస్తా రైల్వే జోన్లోని ఖుర్దా రోడ్ డివిజన్ పరిధిలో ఉన్న ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు 7 రైల్వే స్టేషన్లను విశాఖపట్నం డివిజన్కు బదిలీ చేస్తూ రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్రలోని ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు, సేవల పరిపాలనకు మరింత సౌలభ్యం కలగనుంది. ఇచ్ఛాపురం–పలాస మధ్య ఉన్న ఈ స్టేషన్లు ఇప్పటివరకు తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా డివిజన్ పరిధిలో ఉండేవి. ఇప్పుడు అవి దక్షిణ కోస్తా రైల్వే జోన్లోని విశాఖ డివిజన్ పరిధిలోకి రావడం వల్ల స్థానిక అవసరాలకు వేగంగా స్పందించే అవకాశం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుకు తర్వాత ఇది మరో కీలక అడుగు అని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్తరాంధ్రలో రైల్వే అభివృద్ధి, కొత్త సర్వీసులు, స్టేషన్ సదుపాయాల మెరుగుదలకు ఈ మార్పు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

