గంగవరం, ఏప్రిల్ 4 (పెన్ పవర్):
విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన హెచ్చరికల ప్రకారం, ఈ రోజు మండలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని గంగవరం తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.
ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లడం నివారించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ ధరించడం లేదా రుమాలు కట్టుకోవడం, గొడుగు వినియోగించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
అలాగే శరీరంలో నీటి లోపం రాకుండా తరచుగా మంచినీరు, మజ్జిగ, గ్లూకోజు, నిమ్మరసం, కొబ్బరినీరు, ORS ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు.

