జాబ్ మేళాలో 60 మందికి ఉద్యోగాలు
కాకినాడ, పెన్ పవర్, ఏప్రిల్ 9: కాకినాడ భానుగుడి సెంటర్లోని సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో మొత్తం 60 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు సంస్థ డైరెక్టర్ జంగం బాబ్జీ తెలిపారు. యువత కు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళాను నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందిన అభ్యర్థులకు నేరుగా కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని వివరించారు.
ఈ జాబ్ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్ (తమిళనాడు), టీవీఎస్ మోటార్స్ (తమిళనాడు), శ్రీరామ్ సిటీ ఫైనాన్స్, రిలయన్స్ ట్రెండ్స్, కందుకూరి సిల్క్ సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి బ్యాంకింగ్, మార్కెటింగ్, టెక్నికల్ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులు సంస్థ డైరెక్టర్ జంగం బాబ్జీతో పాటు సైస్ సిబ్బంది, కంపెనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

