గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10: పోటీ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని రంపచోడవరం నియోజకవర్గ యువజన నాయకులు పండా సిద్ధార్థ దొర సూచించారు. ఇటీవల జరిగిన నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినిని ఆయన అభినందించారు.పోలవరం జిల్లా గంగవరం మండలం గంగవరం గ్రామ ప్రభుత్వ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ విజయాన్ని సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపి, ఈ విజయానికి కారణమైన ఉపాధ్యాయులను కూడా సన్మానించారు.అనంతరం విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారిని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా పండా సిద్ధార్థ దొర మాట్లాడుతూ, విద్యార్థులు పోటీ పరీక్షల్లో మరింత రాణించాలని, ఉపాధ్యాయులు సరైన మార్గదర్శకత్వం అందిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా లేదా అంతకంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.

