జూన్ 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – జూన్ 15న శ్రీనివాస కళ్యాణం
గంగవరం/ రంపచోడవరం పెన్ పవర్ ,మే 24: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఐ.పోలవరం గోవింద గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పార్ధు స్వామి, మణికంఠ స్వామి ఆలయ ఇన్స్పెక్టర్ అంచూరి శిరీష తెలిపారు.
ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా జూన్ 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆలయ ప్రాంగణ పరిశుభ్రత, పవిత్రత కోసం నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో అర్చకులు వైఖానస సంప్రదాయ పద్ధతిలో విశేష పూజలు నిర్వహించనున్నారు.
అలాగే జూన్ 15న శ్రీ వారి తృతీయ వార్షికోత్సవ మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం నిర్వహించబడనున్నాయి.సాయంత్రం 5 గంటల నుంచి శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.
అనంతరం స్వామివారి మాడవీధి ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు.

