లక్ష్మణ్ మృతితో పేటమాలీపుట్టులో విషాదఛాయలు.
ముంచంగిపుట్టు ఎస్సై పి నాని.
ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 30:మండలంలో గల దారేలా పంచాయతీ, పేటమాలిపుట్టు గ్రామానికి చెందిన వంతాల లక్ష్మణ్ (14) అనే విద్యార్థి గ్రామ సమీపంలో గల మత్స్యగెడ్డలో ఈతకు వెళ్ళి గెడ్డలో మునిగి మృతి చెందినట్లు ముంచంగిపుట్టు ఎస్ఐ నాని తెలిపారు. గురువారం ఆయన అందించిన వివరాల ప్రకారం.. పేటమాలిపుట్టు గ్రామానికి చెందిన లక్ష్మణ్ కిలగాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదివాడు. వేసవి సెలవులు కావడంతో గ్రామంలో ఉన్న ఆయన తన ముగ్గురు స్నేహితులతో సరదాగా మత్స్యగెడ్డలో ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. గెడ్డలో గల్లంతైయినట్లు గమనించిన తోటి స్నేహితులు హుటాహుటిన గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో నాటు పడవ సహాయంతో ముమ్మరంగా రెండు గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహం వెలికి తీశారు. మండల తహసిల్దార్ భాస్కర అప్పారావు, స్థానిక ఎస్ఐ నాని సంఘటన స్థలంలో చేరుకొని మృతి చెందిన లక్ష్మణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. దారేల మాజీ సర్పంచ్ పాండురంగ స్వామి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యపరిచారు. విద్యార్థి లక్ష్మణ్ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

