👉ఆర్వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రోజీ వినీతాంజలి
గూడెంకొత్తవీధి,పెన్ పవర్,జూన్ 23:గూడెం కొత్త వీధి మండలంలోని ఆర్.వి.నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం పనసపల్లి, బోనంగిపల్లి, బందపాలెం, మూలగరువు, నూతి బంధ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ రోజీ వినీతాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.ప్రస్తుత కాలంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డాక్టర్ రోజీ వినీతాంజలి సూచించారు. తప్పనిసరిగా దోమతెరలు వినియోగించాలని, 20 నిమిషాలు కాచి, చల్లార్చి, వడపోసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, దోమలు వృద్ధి చెందే నీటి నిల్వలను తొలగించి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించుకోవాలని తెలిపారు.అలాగే డయేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించి, పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో జాన్సన్, హెల్త్ అసిస్టెంట్లు మూర్తి, నెహ్రూ, సత్యనారాయణ, ఏఎన్ఎంలు రామలక్ష్మి, వరలక్ష్మితో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

