రంపచోడవరం, జూన్ 25 (పెన్ పవర్): జిల్లాలో పారిశుధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ హెచ్చరించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో విధులు సక్రమంగా నిర్వర్తించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో ఆదేశాలను సరిగా నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వై.రామవరం డిప్యూటీ ఎంపీడీవో సస్పెన్షన్కు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. జూలై 6 నాటికి అన్ని గ్రామాల్లో స్వచ్ఛ రథాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, బయోగ్యాస్ ప్రాజెక్టులు, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

