మాంసాన్ని తినే బ్యాక్టీరియా కలకలం.. ఐదుగురు మృతి!
లూసియానాలో విబ్రియో వల్నిఫికస్ భయం.. ఈ ఏడాది 9 మందికి ఇన్ఫెక్షన్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ లూసియానా, ఆగస్టు 9: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ‘మాంసాన్ని తినే బ్యాక్టీరియా’గా ప్రచారంలో ఉన్న విబ్రియో వల్నిఫికస్ కారణంగా ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు 9 మంది ఈ బ్యాక్టీరియా బారినపడగా, వారిలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
విబ్రియో వల్నిఫికస్ సాధారణంగా తీర ప్రాంతాల్లోని ఉప్పునీటిలో కనిపిస్తుంది. శరీరంపై ఉన్న గాయాలు ఉప్పునీటికి గురైనప్పుడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలాగే సరిగ్గా ఉడికించని లేదా పచ్చిగా ఉన్న సముద్ర ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఇప్పటికే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తీర ప్రాంతాల్లో సముద్రపు నీటిలోకి వెళ్లే సమయంలో గాయాలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని, సీఫుడ్ను పూర్తిగా ఉడికించి మాత్రమే తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

