✒️
గిరి ప్రదక్షిణలో విశేష సేవలందించిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం ఆగష్టు 8: సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విశేష సేవలందించిన సింహాచలం డిపో ఆర్టీసీ సిబ్బందిని విశాఖపట్నం రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు అభినందించారు. శనివారం సింహాచలం డిపోలో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొని డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది, సూపర్వైజర్లు, అధికారులు తదితరులను అభినందించారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.
గిరి ప్రదక్షిణ సమయంలో సింహాచలం కొండపై నుంచి కొండ దిగువ ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల రవాణా కోసం నిరంతరాయంగా బస్సు సర్వీసులు నిర్వహించి మెరుగైన సేవలు అందించారని ఆర్టీసీ సిబ్బందిని ఆర్ఎం ప్రశంసించారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల కార్యక్రమాలకు ప్రయాణికుల రవాణాలో విశేష సేవలందించిన విశాఖ జిల్లా ఆర్టీసీ సిబ్బందిని కూడా ఆయన అభినందించారు.
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలని, ప్రతి బస్సును నిర్ణీత బస్స్టాప్ల వద్ద తప్పనిసరిగా నిలిపి ప్రయాణికులను ఆకట్టుకునేలా విధులు నిర్వహించాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభా సర్టిఫికెట్లతో సత్కరించనున్నట్లు తెలిపారు.
రోడ్డు భద్రతకు ప్రాధాన్యం
అనంతరం సింహాచలం బస్స్టేషన్, ఏపీఎస్ఆర్టీసీ డిపోను రీజినల్ మేనేజర్ తనిఖీ చేశారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ట్రాఫిక్ సిగ్నళ్లను తప్పనిసరిగా పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. బస్సుల్లో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని, బస్సుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
బస్స్టేషన్లోని ఫ్యాన్లు, బెంచీలు తదితర సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, ప్రయాణికుల సౌకర్యార్థం వాష్రూమ్లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
- ఈ కార్యక్రమంలో సింహాచలం డిపో మేనేజర్ హెచ్. హనుమశ్రీ, అసిస్టెంట్ ఇంజనీర్ కొండలరావు, సూపర్వైజర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

