హైకోర్టు స్టే పై స్పందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ
అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు
నర్సీపట్నం, పెన్ పవర్:
నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డుల విభజన ప్రక్రియ నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ స్పందించారు. మాకిరెడ్డి బుల్లిదొర హై కోర్టులో WP నెంబర్ 15544/2026లో నర్సీపట్నం పురపాలక సంఘములో జరిగిన 40 వార్డుల విభజన సమగ్రంగా, పారదర్శకంగా జరగలేదని దావా వేసినట్లు, వార్డు విభజనలో ప్రజల అభ్యంతరాలు, చట్ట బద్ధమైన విధానాలు పరిగణలోకి తీసుకోవాలని హై కోర్టు సూచించినట్లు, స్టే విధించినట్లు వాట్సాప్ గ్రూపులో న్యూస్ సర్క్యులేట్ అవుతున్నది. ఇతను హై కోర్టులో వేసిన రిట్ పిటీషన్ అఫిడవిట్ వెరిఫై చేస్తే ఇతను చెబుతున్నదానికి, వాస్తవంగా కోర్టులో వేసిన అఫిడవిట్ కి అసలు పొంతనే లేదన్నారు. అఫిడవిట్ లో ఎక్కడా కూడా ఇతను ప్రస్తావించిన అంశాలు లేవు. దేశ వ్యాప్తముగా 2027 జనాభా లెక్కలు జరుగుతుండగా వార్డుల సంఖ్య ఎలా పెంచుతారు, ఎలా నోటిఫికేషన్ ఇస్తారు అని మాత్రమే హై కోర్టులో రిట్ పిటీషన్ వేయడం జరిగిందన్నారు. హై కోర్టులో ఫైల్ అయిన ఇటువంటి రిట్ పిటీషన్లు అన్నింటినీ కలుపుతూ కామన్ ఆర్డర్ కొరకు 30.6.2026 కి కేసు వాయిదా వేసినట్లు తెలిసిందన్నారు. కోర్టు ఆర్డర్ ఇంకా అప్లోడ్ చెయ్యాలి. హై కోర్టును ఆశ్రయించిన కారణాన్ని స్పష్టముగా చెప్పకుండా కోర్టులో వేసిన అఫిడవిట్ కు విరుద్ధముగా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనల్ గా హైకోర్టు వారు తుది తీర్పులు ఇవ్వాల్సి ఉందని, ఒక లాయర్ అయి ఉండి వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు.

