నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
కాజులూరు, పెన్ పవర్ ఆగస్టు 19: కాజులూరు మండలం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నిక జరిగింది.అసోసియేషన్ అధ్యక్షుడిగా గొల్లపాలెం, జగన్నాధగిరికి చెందిన శ్రీ విద్యానికేతన్ స్కూల్ నిర్వాహకులు చెల్లుబోయిన రాంబాబును, కార్యదర్శిగా గొల్లపాలెంలోని ఉషోదయ స్కూల్కు చెందిన ఫిరోజ్ను, కోశాధికారిగా కాకతీయ స్కూల్కు చెందిన పేరూరి కేతన్ ప్రిన్స్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని తెలిపారు. మండలంలోని ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని, అసోసియేషన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. మండలంలోని ప్రైవేట్ పాఠశాలల మధ్య సమన్వయం పెంపొందించడంతో పాటు విద్యారంగ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.

