
గంగవరం, పెన్ పవర్ మార్చి 29 : పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలానికి చెందిన మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభకు 44వ తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది. మంగళగిరిలోని టిడిపి పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు సమక్షంలో వేదికను అలంకరించే అవకాశం ఆమెకు లభించింది.ఈ సందర్భంగా తీగల ప్రభ మాట్లాడుతూ, పార్టీ కష్టకాలంలో సీనియర్ కార్యకర్తగా పనిచేస్తూ “బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారంటీ” సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా బూత్, యూనిట్, క్లస్టర్ స్థాయిలో విస్తృతంగా పనిచేశానని తెలిపారు. ప్రజల నుంచి అధికంగా ఐవీఆర్ఎస్ కాల్స్ రావడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను విజయవంతం చేయడం వలన ఈ గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు.ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు, ఎమ్మెల్యే శిరీషా దేవికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడంలో తెలుగు దేశం పార్టీ ముందుంటుందని ఆమె అన్నారు.ఇదే సందర్భంలో తీగల ప్రభతో పాటు కష్టపడి పనిచేసిన మరో 19 మంది కార్యకర్తలను కూడా పార్టీ నాయకత్వం గుర్తించి శాలువాలు మరియు చిన్న ఎన్టీఆర్ విగ్రహాలతో సన్మానించింది.

