హర్షియా సుల్తానాకు అభినందనలు తెలిపిన మర్రి రాజశేఖర్
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 05:
చిలకలూరిపేట: ఐడీసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల 7వ టీ-10 జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్–2026 లో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయంపై శాసనమండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి బలమైన జట్లను సమర్థంగా ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ జట్టు అజేయంగా నిలవడం రాష్ట్ర క్రీడా ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ చారిత్రాత్మక విజయానికి పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన షేక్ మక్బూల్ కుమార్తె హర్షియా సుల్తానా కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.
ఈ సందర్భంగా హర్షియా సుల్తానా తన కుటుంబ సభ్యులతో కలిసి మర్రి రాజశేఖర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె ఆట తీరు, ప్రతిభా సామర్థ్యాలపై వివరాలు తెలుసుకుని, జట్టు విజయానికి చేసిన సేవలను అభినందించారు. ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చిన తల్లిదండ్రులను కూడా ప్రశంసించారు.
భవిష్యత్తులో జాతీయ మహిళా జట్టులో స్థానం సంపాదించి, ప్రాంతానికి మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్ మహబూబ్ సుభాని, షేక్ అలీ అక్బర్, షేక్ ఫర్హత్, షేక్ సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

