ఆనందపురం వద్ద ఫ్లైఓవర్తో ట్రాఫిక్కు చెక్
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి వేగవంతమైన ఏర్పాట్లు
మార్కెట్ మార్పుతో శాశ్వత పరిష్కారం
ఏడు కీలక రహదారుల నిర్మాణం జోరుగా
జూన్ నాటికి కనెక్టివిటీ పూర్తి లక్ష్యం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందు విశాఖపట్నం నుంచి ట్రాఫిక్ రహిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆనందపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు కీలక రహదారుల అభివృద్ధికి వేగం పెంచుతోంది.
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఏప్రిల్ 17:
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందు, విశాఖపట్నం నుంచి అక్కడికి సులభంగా చేరుకునేలా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.భోగాపురం విమానాశ్రయం జులై లేదా ఆగస్టు నెలల్లో ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ప్రారంభమైతే ప్రస్తుతం విశాఖలో ఉన్న విమానాశ్రయాన్ని నేవీకి అప్పగించే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికుల రాకపోకలు భోగాపురం వైపు మళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా రహదారి సదుపాయాలను మెరుగుపరచడం అత్యవసరంగా మారింది.
ఈ క్రమంలోనే విశాఖ నుంచి భోగాపురం వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న ఆనందపురం జంక్షన్ను కీలకంగా గుర్తించారు. ప్రస్తుతం ఈ జంక్షన్ వద్ద అనకాపల్లి, భోగాపురం వైపు వెళ్లే వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి పరిష్కారంగా భోగాపురం వైపు ప్రత్యేక ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు.ఇప్పటికే ఈ ఫ్లైఓవర్కు సంబంధించిన అలైన్మెంట్ ఖరారు చేయగా, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేసే పనులు ప్రారంభమయ్యాయి. 45 రోజుల్లో డీపీఆర్ పూర్తి చేసి, వెంటనే పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలు అయితే ఆనందపురం జంక్షన్ వద్ద ట్రాఫిక్ గణనీయంగా తగ్గనుంది.ఇక ఈ జంక్షన్ పరిసరాల్లో ఉన్న కూరగాయల మార్కెట్, పూల మార్కెట్ కూడా ట్రాఫిక్కు ప్రధాన కారణంగా మారాయి. ఈ మార్కెట్లను ఇతర ప్రాంతాలకు తరలించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది అమలు అయితే ట్రాఫిక్ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభించే అవకాశం ఉంది.మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్కు అనుసంధానంగా పలు కీలక రహదారుల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తిమ్మాపురం–మారికవలస రహదారి పనులు పూర్తిదశకు చేరుకోగా, అడవివరం–శొంఠ్యాం ఆరు లేన్ల రహదారి పనులు ప్రారంభమయ్యాయి. నేరళవలస–కొత్తవలస, బోయపాలెం–కాపులుప్పాడ రహదారులు ఏప్రిల్ చివరినాటికి పూర్తయ్యే అవకాశముంది.పెందుర్తి ప్రాంతంలోని రహదారులు మే–జూన్ నాటికి పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే భీమిలి నుంచి దొరతోట వరకు రహదారిని 100 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానించేందుకు ఇప్పటికే అనుమతులు లభించాయి.ప్రభుత్వ లక్ష్యం ప్రకారం జూన్ నాటికి విమానాశ్రయానికి అనుసంధానంగా ఉన్న ఏడు కీలక రహదారులను పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నారు. మొత్తం మీద భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంతో పాటు విశాఖ నగర రవాణా వ్యవస్థలో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.

