సకాలంలో స్పందించిన లైఫ్ గార్డ్..
ప్రాణాలతో బయటపడిన తెలంగాణ పర్యాటకురాలు
విశాఖ దక్షిణం, పెన్ పవర్ జూలై 19:
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ఆదివారం మరోసారి ప్రమాదం తృటిలో తప్పింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళలు సముద్రంలో స్నానానికి దిగగా, అలల ఉద్ధృతి కారణంగా వారిలో సుజాత (56) అనే మహిళ సముద్ర కెరటాల దాటికి కొంత దూరం కొట్టుకుపోయింది.
మహిళ ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని గమనించిన బీచ్ లైఫ్ గార్డ్ ఎం. ధనరాజు వెంటనే అప్రమత్తమై సముద్రంలోకి దిగి సాహసోపేతంగా ఆమెను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పి, సుజాత ప్రాణాలతో బయటపడింది.
ఈ ఘటనతో బీచ్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పర్యాటకులు, స్థానికులు లైఫ్ గార్డ్ ధనరాజు సమయస్ఫూర్తిని అభినందించారు.
ఈ సందర్భంగా అధికారులు సముద్రంలో స్నానానికి దిగే పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని, హెచ్చరికలు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో లైఫ్ గార్డుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

