గూడెంకొత్తవీధి, పెన్ పవర్, ఆగస్టు 25: మండలంలోని రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సురేష్ సూచించారు. మంగళవారం ఆసరాడ గ్రామపంచాయతీలో నిర్వహించిన ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 15,905 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 9,132 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని తెలిపారు. గతంలో అటవీ హక్కుల పట్టాలు (ఆర్ఓఎఫ్ఆర్) పొందిన రైతుల్లో పలువురు ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోలేదని, వారంతా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. మండలంలో 9,233 మంది రైతులకు పీఎం కిసాన్ పథకం ప్రయోజనం అందుతుండగా, ఇప్పటివరకు 5,708 మంది మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఫార్మర్ ఐడీ కలిగిన రైతులు మాత్రమే పంటల బీమా, సబ్సిడీ విత్తనాలు, వివిధ సంక్షేమ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీ వంటి ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులవుతారని వ్యవసాయ అధికారి తెలిపారు. పీఎం కిసాన్ పథకం తదుపరి విడత ప్రయోజనం కూడా ఫార్మర్ ఐడీ ఉన్న రైతులకే అందుతుందని పేర్కొన్నారు.అందువల్ల రైతులంతా సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వార్షిక ఈ-కేవైసీని రైతు సేవా కేంద్రాలు లేదా మీ-సేవ కేంద్రాల్లో ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు సౌందర్య, గ్రామ ఉద్యాన సహాయకుడు సింహాచలంతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
రైతులంతా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలి:పీఎం కిసాన్ తదుపరి విడతకు రైతు ఐడీ తప్పనిసరి
RELATED ARTICLES

