కంటైనర్ ఢీకొని చేపల వ్యాపారి మృతి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 11: చేపల కొనుగోలు కోసం ఫిషింగ్ హార్బర్కు వెళ్తున్న ఓ చేపల వ్యాపారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గుర్ల మండలం కలవచర్ల గ్రామానికి చెందిన గుమ్మడి సూర్యనారాయణ (50) ఈ ప్రమాదంలో మృతి చెందారు.
రోజువారీగా సొంత గ్రామం నుంచి విశాఖ ఫిషింగ్ హార్బర్కు వచ్చి చేపలను కొనుగోలు చేసి, వాటిని తిరిగి గ్రామానికి తీసుకెళ్లి విక్రయిస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో మంగళవారం ఎండాడ నుంచి ఫిషింగ్ హార్బర్కు వెళ్తుండగా విశాఖ వ్యాలీ స్కూల్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని కంటైనర్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సూర్యనారాయణ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
సూర్యనారాయణ మృతితో కలవచర్ల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

