రిషికొండ శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత
భక్తులతో ఆప్యాయంగా మాట్లాడి దర్శన ఏర్పాట్లపై ఆరా
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 8:
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా రిషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న హోంమంత్రికి ఆలయ అధికారులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం హోంమంత్రి అనిత అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయంలోని క్యూ లైన్లో ఉన్న భక్తులతో హోంమంత్రి అనిత ఆప్యాయంగా మాట్లాడారు. భక్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు దర్శన ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చేస్తున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.

