దేశాయిపేట, సెప్టెంబర్ 19 (పెన్ పవర్):
వేటపాలెంమండలం, దేశాయిపేట సెక్టార్లోని నీలకంఠపురం అంగన్వాడీ కేంద్రం వద్ద పోషణ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సూపర్వైజర్ ఎస్. లీలావతి పాల్గొని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సమతుల ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.
రక్తహీనతను నివారించేందుకు అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు, మినరల్స్,ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. గర్భిణుల నుంచి ఆరేళ్లలోపు పిల్లల వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రంలోని పోషణ వాటికలో ఆకుకూరలు, మునగ, కరివేపాకు, వంకాయ, చిక్కుడు తదితర కూరగాయలను పెంచుతూ, వాటిని చిన్నారుల పోషకాహారంలో వినియోగిస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.

