ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 11:
రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన రోహిత్ సింగ్ యాదవ్ (21), ఉపాధి కోసం అని మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి, కోహెడ రోడ్డులోని ఒక ఫంక్షన్ హాల్లో సెక్యూరిటీ గార్డ్గా చేరాడు. కాగా, ఈ నెల 7వ తేదీన రాత్రి విధులు ముగించుకుని భోజనం కోసం శ్రీ గురు కాలేజీ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుండి అతివేగంగా వచ్చిన కారు అతడిని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన రోహిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుని బాబాయి మిథిలేషు సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.
నిందితుడి రిమాండ్
కేసును సవాలుగా తీసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు, సంఘటనా స్థల పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. సాంకేతిక ఆధారాలను సేకరించి, విశ్లేషించి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించారు. పీర్జాదిగూడకు చెందిన బి.టెక్ విద్యార్థి వరుణ్ అనే వ్యక్తి ఎర్టిగా కార్ వాహనాన్ని అతివేగంగా, తీవ్ర నిర్లక్ష్యంగా నడిపి, రోహిత్ను ఢీకొట్టినట్లు ధృవీకరించి, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచి, అనంతరం నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

