జడ్పీటీసీ సభ్యురాలు ఏ. బేబీ రత్నం
గంగవరం ,పెన్ పవర్, ఏప్రిల్ 4:
ఏజెన్సీ ప్రాంత మహిళల సాధికారతకు కుట్టు శిక్షణ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జడ్పీటీసీ సభ్యురాలు, గిరి కిరణం ఆగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఏ. బేబీ రత్నం అన్నారు. శనివారం మండల కేంద్రంలో గిరి కిరణం ఆగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసిన 100 మంది మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. మండలంలో ప్రస్తుతం 22 గ్రూపులలో 446 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారని, వీరిలో 100 మందికి కుట్టు మిషన్లు అందించామని వివరించారు. ఈ శిక్షణ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆమె పేర్కొన్నారు.అనంతరం సంస్థ చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ అనకాపల్లి, పాడేరు, పోలవరం జిల్లాల్లో సుమారు 5000 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కొత్త శిక్షణా కేంద్రాల్లో 32 మంది ట్రైనర్లను నియమించి మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం అప్పలకొండ, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పండ సిద్ధార్థ దొర, జనసేన మండల అధ్యక్షుడు కుంజం సిద్దు తదితరులు పాల్గొని ప్రసంగించారు. గిరి కిరణం సంస్థ అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

