ప్రజల్లో భయాందోళనలు – బంధించేందుకు అటవీశాఖ ప్రయత్నాలు
గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, మార్చి 10:
పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం మారేడుబాక పంచాయితీ కోసూరి వారి వీధి గ్రామ పరిధిలోని పొలాల్లో ఉన్న పశువుపై సోమవారం రాత్రి పెద్దపులి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.గ్రామస్తుల సమాచారం మేరకు అటవీశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గత రెండు రోజులుగా రాజవొమ్మంగి మండల పరిధిలోకి ప్రవేశించిన పెద్దపులి కదలికలు స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని రేంజర్ ఉషారాణి ధృవీకరించారు.పెద్దపులిని బంధించేందుకు అడ్డతీగల సబ్ డివిజన్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నుంచి వచ్చిన ప్రత్యేక శిక్షణ పొందిన బృందం అటవీశాఖ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టింది. పెద్దపులి కదలికలను గుర్తించి సురక్షితంగా బంధించేందుకు అధికారులు విశేషంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారి బి.ఎస్.ఎన్ మూర్తి, సీసీఎఫ్ శ్రీకంఠనాథరెడ్డి, డీఎఫ్ఓ శివకుమార్ గంగల్ పెద్దపులి కదలికలపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ, అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు చేస్తున్నారు.అటవీశాఖ అధికారులు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని సూచించారు. పెద్దపులి బంధించే వరకు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.