నర్సీపట్నం, పెన్ పవర్:
మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పట్నాల శ్రీను అనారోగ్య కారణాలతో మంచానికే పరిమితమవడంతో ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు “సాయం 10 రూపాయలు” స్వచ్ఛంద సంస్థ సభ్యులు విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సేకరించిన విరాళాల మొత్తంగా రూ.18,40,000లను శనివారం పట్నాల శ్రీను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ సభ్యులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న మొత్తంలో చేసిన సాయం కూడా ఒక కుటుంబానికి పెద్ద సహాయంగా మారుతుందని పేర్కొన్నారు. పట్నాల శ్రీను కుటుంబ సభ్యులు సహాయం అందించిన దాతలకు, స్వచ్ఛంద సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దాతలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

