జనసేనలోకి భోగి రమణతో పాటు 45 మంది కీలక నేతల చేరిక
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : విశాఖ జనసేన పార్టీ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఎస్.కోట మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు భోగి రమణ తన అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్, వైఎస్సార్సీపీకి చెందిన సుమారు 45 మంది ముఖ్య నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పార్టీ కండువా కప్పుకుని జనసేనలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది జనసేన వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు.
ఎస్.కోట నియోజకవర్గంలో జనసేనకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, భోగి రమణ వంటి సీనియర్ నాయకుల చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నేతలు సీతామా నాయుడు, గోపి, అరుణ్ కుమార్, అచ్చిబాబు, అప్పారావు, నానాజీ, మురళి తదితర ప్రజాప్రతినిధులు, జనసేన ఎస్.కోట పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సత్తిబాబు, మాజీ వైస్ ఎంపీపీ అప్పారావు, సుంకర అప్పారావు, రవికుమార్, సన్యాసినాయుడు, షేక్ ఫిరోజ్, జానీతో పాటు జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
త్వరలో ఎస్.కోటలో భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

