విశాఖ దక్షిణ జోన్లో పారిశుద్ధ్యంపై జోనల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
చెత్త సేకరణలో నిర్లక్ష్యం.. సానిటరీ సూపర్వైజర్పై సస్పెన్షన్కు ఆదేశం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం , జూలై 3 : నగరంలోని దక్షిణ జోన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్యనాయుడు శుక్రవారం ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 30వ వార్డులోని కొత్త సాలిపేట, మంతవారి వీధి, మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడాన్ని గుర్తించిన కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సానిటరీ సూపర్వైజర్ను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రోడ్లు, కాలువల్లో చెత్త వేయడం వల్ల ప్రజారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తున్న స్థల యజమానులకు నోటీసులు జారీ చేసి, అపరాధ రుసుము విధించాలని అధికారులకు సూచించారు.
అనంతరం కొత్త సాలిపేటలో నిర్వహించిన ‘డ్రై డే–ఫ్రైడే’ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పారిశుద్ధ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో ఏఎంఓ డా. కృష్ణంరాజు, డీఈ విజయ్ కుమార్, సానిటరీ సూపర్వైజర్ నీలిమ, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో పాటు సానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

