వివాహేతర సంబంధం వివాదం.. యువతి హత్య
సూట్కేస్లో మృతదేహం పెట్టి ఒడిశా అడవుల్లో పడేసిన కారు డ్రైవర్.. సీసీటీవీ ఆధారాలతో నిందితుడి అరెస్ట్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ , విశాఖపట్నం, జులై 31:
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందనే కారణంతో ఓ యువతిని దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని సూట్కేస్లో పెట్టి ఒడిశా అడవుల్లో పడేసిన ఘటన సంచలనం సృష్టించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నంలోని కంచరపాలెం దుర్గానగర్కు చెందిన బొలిశెట్టి సురేష్ కుమార్ (32) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి పెందుర్తికి చెందిన సంధ్య (20)తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. ఇటీవల సంధ్య తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆగ్రహించిన సురేష్ ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం జగదాంబ సెంటర్లో పెద్ద సూట్కేస్ కొనుగోలు చేసిన సురేష్, మృతదేహాన్ని అందులో ఉంచి రైలు ద్వారా ఒడిశాలోని రాయగడ జిల్లా జేకేపూర్ సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పడేసి తిరిగి విశాఖకు వచ్చాడు.
కొద్ది రోజుల తర్వాత సూట్కేస్ నుంచి దుర్గంధం రావడంతో ఒడిశా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా నిందితుడి కదలికలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం విశాఖపట్నం పోలీసుల సహకారంతో సురేష్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్పై ఒడిశాలోని రాయగడ కోర్టుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
