గూడ్స్ వాహనంలో 25 మంది కూలీల ప్రయాణం. రూ.19 వేల జరిమానా విధింపు
చింతూరు, పెన్ పవర్, జూన్ 7:
చత్తీస్గఢ్కు చెందిన ఓ బొలెరో గూడ్స్ వాహనంలో 25 మంది కూలీలను తరలిస్తుండగా చింతూరు పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టారు. చింతూరు ఎస్ఐ వాహన తనిఖీల సమయంలో గూడ్స్ వాహనంలో అధిక సంఖ్యలో కూలీలు ప్రయాణిస్తున్నట్లు గుర్తించి చెక్ రిపోర్ట్ సిద్ధం చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు సమర్పించారు. అనంతరం సంబంధిత వాహనంపై రూ.19 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కూలీలు గానీ, విహారయాత్రలకు వెళ్లే వ్యక్తులు గానీ గూడ్స్ వాహనాల్లో ప్రయాణించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రయాణికులు తప్పనిసరిగా అనుమతించిన ప్రయాణికుల వాహనాల్లోనే ప్రయాణించాలని పోలీసులు సూచించారు.

