నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం మున్సిపాలిటీ ఉత్తర వాహిని నదీతీరంలో ఉన్న శ్రీశ్రీ పాకలపాటి గురువుగారి ఆశ్రమంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెల మాస శివరాత్రి రోజున శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు.

ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనం తీసుకెళ్లిన పూజ ద్రవ్యాలతో మనమే శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. శివలింగాన్ని స్పర్శించే అవకాశం ఉంటుంది. దీంతో పట్టణ ప్రజలు ప్రతి మాస శివరాత్రికి తప్పక పూజలలో పాల్గొంటుంటారు. ఆశ్రమ నిర్వాహకులు ఈ పూజలలో పాల్గొనే భక్తులకు అవసరమైన సామగ్రిని ఉచితంగానే అందజేస్తారు. ఈ పూజలకు ఎలాంటి రుసుము వసూలు చేయరు. భక్తులు గ్రహ దోషాలు నివారణకు ఈ పూజలలో పాల్గొంటారని, వారికి తగిన విధంగా సహకరించడమే మా లక్ష్యమని నిర్వాహకులు చెబుతుంటారు. ఈ పూజలు అనంతరం భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. దోషాల నివారణకు పాల్గొనే భక్తులు ప్రతి మాస శివరాత్రి ఉదయం 7 గంటలకు వచ్చి పూజలలో పాల్గొనవచ్చని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.

