భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం విజయవంతం కావాలని కనకమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జులై 29 : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం విజయవంతంగా జరగడంతో పాటు ఆంధ్రప్రదేశ్కు మరింత అభివృద్ధి చేకూరాలని ఆకాంక్షిస్తూ విశాఖ బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయ శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆగస్టు 1న విజయనగరం జిల్లా భోగాపురంలో జరగనున్న విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తెల్లవారుజామున పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర నవావరణార్చన, మహాలక్ష్మీ హోమం, పూర్ణాహుతి వంటి విశేష పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలకు శుభాలు కలగాలని ప్రార్థించారు.
గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం వ్యాస మహర్షికి గురుపూజను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. రాజేంద్ర కుమార్, పర్యవేక్షకులు ఎం.వి. రమణ, వేదపండితులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ జులై 30న ఆలయంలో వరుణ జపాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

